Press "Enter" to skip to content

Telangana Cabinet expansion: నేడు మంత్రివర్గ విస్తరణ

శ్రీహరి, వివేక్, లక్ష్మణ్‌కుమార్‌లకు చోటు

ఉప సభాపతిగా రామచంద్రునాయక్‌!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. కొత్తగా ముగ్గురికి చోటు దక్కనుంది. ఆదివారం మధ్యాహ్నం 12.00 – 12.20 గంటల మధ్య ప్రమాణస్వీకారం జరగనుంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. బీసీల నుంచి వి.శ్రీహరి ముదిరాజ్, ఎస్సీల నుంచి వివేక్‌ (మాల), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ (మాదిగ)లకు చోటు లభించనుంది. శాసనసభ ఉప సభాపతిగా రామచంద్రునాయక్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లు మొదటి నుంచీ వినిపించినా ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం చెప్పినట్లు తెలిసింది. అయితే మాదిగ సామాజికవర్గంతోపాటు ఎస్టీల నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలని.. నిజామాబాద్‌ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డికి కూడా చోటు కల్పించాలని ముఖ్యమంత్రి పట్టుబడుతున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన సోదరుడు, మంత్రి వెంకట్‌రెడ్డిని కూడా కొనసాగించడం కష్టమని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే చోటు కల్పించాల్సి ఉంటుందని అధిష్ఠానం స్పష్టంచేయడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలిసింది.

విస్తృత చర్చల అనంతరం..

గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌లతో కాంగ్రెస్‌ అధిష్ఠానం చర్చించింది. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత ఎవరెవరికి చోటు కల్పించాలో నిర్ణయం చెబుతామన్న అధిష్ఠానం శనివారం తన అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. అనంతరం పార్టీకి సంబంధించిన పలువురు నాయకులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది. నాలుగో పేరును ప్రస్తుతానికి పక్కనపెట్టి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముగ్గురికి అవకాశం కల్పిస్తే మరో మూడు స్థానాలు ఖాళీగా ఉంటాయి. వీటితోపాటు చీఫ్‌ విప్‌ పదవి భర్తీకి కూడా కసరత్తు సాగుతోంది. బీసీల నుంచి ఆది శ్రీనివాస్‌ ప్రస్తుతం శాసనసభలో విప్‌గా ఉన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేనందున వికారాబాద్‌ ఎమ్మెల్యే, సభాపతి ప్రసాద్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి సభాపతి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా పార్టీ పరిశీలనలో ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. మంత్రి పదవుల కోసం గట్టిగా పోటీపడుతున్నవారిలో ఒకరికి చీఫ్‌ విప్‌ పదవి ఇచ్చి సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. గత 4 రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్న మీనాక్షి నటరాజన్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించిన నేపథ్యంలో సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని విస్తరణ ఉండాలని అధిష్ఠానానికి సూచించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీ లైనుకు భిన్నంగా ఎవరు మాట్లాడినా తదుపరి పదవుల్లో వారికి ప్రాధాన్యం ఉండదని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం.


సీఎంకు వినతిపత్రం..

ఎస్సీ వర్గీకరణ అమలుకు దేశంలోనే తొలిసారి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టినందున దానిప్రకారం మంత్రివర్గంలో తమ వర్గానికి తగు ప్రాతినిధ్యం కల్పించాలని మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వేముల వీరేశం, సామేల్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య సీఎంను కలిసినవారిలో ఉన్నారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా తమ వర్గానికి తగినన్ని టికెట్లు ఇవ్వలేదని, అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అవకాశం రాలేదని, మంత్రివర్గంలో తప్పనిసరిగా ఒకరికి చోటు కల్పించాలని వారు సీఎంను కోరినట్లు తెలుస్తోంది.

Source link

More from NewsMore posts in News »