హైదరాబాద్: హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసినా.. తమ్మిడికుంట చెరువు కోసం సినీనటుడు అక్కినేని నాగార్జున (akkineni nagarjuna) స్వచ్ఛందంగా రెండెకరాల స్థలం ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) తెలిపారు. పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.
‘‘నీళ్లు ఉండాల్సిన చెరువులు, కుంటలు, నాలాలను మనం కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్లు ఎక్కడి పోవాలో తెలియక నగర రోడ్లపైకి వస్తున్నాయి. అన్యాయంగా ఆక్రమించుకొని చెరువుల్లో చేపట్టిన నిర్మాణాలను హైడ్రా ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవల అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ను ప్రభుత్వం తొలగించింది. ఆ తర్వాత నాగార్జున గారు గుర్తించి.. వారే స్వయంగా ముందుకొచ్చి నన్ను కలిసి చెరువు కోసం 2 ఎకరాలు అప్పగించారు. నగర అభివృద్ధిలో నేనొక హీరోగా ముందుంటానని నాగార్జున వాలంటీరుగా ముందుకొచ్చారు. మంచి సంకల్పంతో చెరువును అభివృద్ధి చేస్తున్నారని రెండెకరాల స్థలం ప్రభుత్వానికి అప్పగించారు’’ అని సీఎం తెలిపారు.
మాదాపూర్లో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్హాలును హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) అధికారులు ఇటీవల నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. తమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ హైడ్రా ఈ కూల్చివేత చర్యలు చేపట్టింది. చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్టీఎల్), బఫర్జోన్లో కట్టడాలున్నాయని అధికారులు గుర్తించారు. వాటిలో అతి పెద్ద నిర్మాణమైన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేసిన విషయం తెలిసిందే.