హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భాజపాకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షపదవికి నామినేషన్ వెయ్యనివ్వలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి పంపించినట్లు తెలిపారు. తెలంగాణలో భాజపా అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఇవాళ ఉదయం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని, అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలని ఆయన అన్నారు. నావాడు, నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి రావాలంటే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారు.
‘‘ నామినేషన్ వేయడానికి వెళ్లాను. దరఖాస్తు కూడా తీసుకున్నాను. జాతీయ కౌన్సిల్ సభ్యులు మద్దతు ఇవ్వకుండా బెదిరించారు. పార్టీలో ఉంటారా సస్పెండ్ చేయాలా అని హెచ్చరించారు. ముగ్గురు సభ్యులు నా దరఖాస్తుపై సంతకం చేశారు. ఇంకా ఏడుగురు సభ్యుల సంతకం అవసరం. దీంతో నామినేషన్ వేయడం కుదరలేదు. అందుకు కిషన్రెడ్డికి రాజీనామా లేఖ ఇచ్చి.. ఆమోదించాలని కోరాను. రాజాసింగ్ మా ఎమ్మెల్యే కాదు సస్పెండ్ చేయాలని స్పీకర్కు చెప్పాలని కిషన్రెడ్డికి చెప్పా. 2014 నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా’’ అని రాజాసింగ్ అన్నారు.