హైదరాబాద్: నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush), రష్మిక ప్రధాన పాత్రల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘కుబేర’ (Kuberaa). ఈ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ఈ నెల 20న బాక్సాఫీసు ముందుకు రానుంది. ఈ సందర్భంగా.. రాజమౌళి (Rajamouli) ముఖ్య అతిథిగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆదివారం నిర్వహించింది. ఈ సందర్భంగా నాగార్జున, ధనుష్ మాట్లాడారు.
మేం పాత్రధారులం మాత్రమే: నాగార్జున
‘‘ధనుష్తో కలిసి నటించినందుకు హ్యాపీగా ఉంది. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఇది కేవలం శేఖర్ కమ్ముల ఫిల్మ్. మేం పాత్రధారులం మాత్రమే. శేఖర్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా ఇది. మమ్మల్ని కూడా మా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. ‘మాయాబజార్’ సినిమాలో ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీ రంగారావు.. వీరిలో హీరో ఎవరు? వారెవరూ కాదు కేవీ రెడ్డి (దర్శకుడు) హీరో. అలా కుబేర హీరో శేఖర్. చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో నాకు టీమ్ వర్క్ కనిపించింది. ఈ సినిమాకి మరో బలం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్’’ అని ప్రశంసించారు. ‘శివ’ రీ రిలీజ్ అవుతుందని అభిమానులకు తెలిపారు.
ఆ సినిమా కంటే ముందే కుబేర: ధనుష్
‘‘ఇక్కడ ప్రదర్శించిన నా ఏవీ చూడగానే నాన్న గుర్తొచ్చారు. ఆయన వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. ఈ సినిమా కోసం శేఖర్ సర్ చాలా కష్టపడ్డారు. ‘కుబేర’ తమిళ్లో నాకు 51వ సినిమా, తెలుగులో రెండో చిత్రం. కానీ, ‘సార్’ మూవీ కంటే ముందే నాకు శేఖర్ ఈ కథ చెప్పారు. ఇందులో నటించే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్. నాగార్జున సర్తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. రష్మిక కష్టపడి పని చేస్తుంది’’ అని ధనుష్ ప్రశంసించారు. ఈ సినిమాపై శేఖర్ కమ్ములకు ఉన్న నమ్మకం చూస్తుంటే తనకు భయంగా ఉందన్నారు.
‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ నిజంగా మైండ్ బ్లోయింగ్: ఎస్.ఎస్. రాజమౌళి
సరస్వతీ దేవి తల ఎత్తుకుని చూసే సినిమా: శేఖర్ కమ్ముల
‘‘ఈ వేడుకకు ఆహ్వానించగానే వచ్చిన రాజమౌళి గారికి థాంక్స్. సినిమా పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోతున్నా. వర్క్ పూర్తికాగానే ప్రమోషన్స్లో పాల్గొంటా. నా దృష్టిలో ‘కుబేర’ సినిమా నాకు తల్లిలాంటిది. ధనవంతుడైనా, యాచుకుడైనా తల్లి ప్రేమలో మార్పు ఉండదు. ఇలాంటి కథను తెరకెక్కించడం నా అదృష్టం. సరస్వతీ దేవి తలవంచుకోకుండా ఉంటే చాలు అని నా గత సినిమాల విషయంలో చెప్పేవాడిని. కానీ, ఈ సినిమాని సరస్వతి తల ఎత్తుకుని చూస్తుంది. ఇది గర్వంతో చెబుతున్న మాట కాదు. మీరు ఇప్పటి వరకూ చూడని కొత్త అంశంతో రూపొందింది. అసలైన పాన్ ఇండియా సినిమా. అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎమోషన్, కామెడీ, థ్రిల్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నా శైలికి భిన్నమైన సినిమా అని చాలామంది అంటున్నారు. నాకే కాదు సినిమాల్లోనే ప్రత్యేకం. కథ విషయంలో చైతన్య పింగళి సాయం చేశారు. నాగార్జున స్నేహపూర్వకంగా ఉంటారు. కానీ, ఆయన్ను డైరెక్టర్ చేయడం టెన్షన్ అనిపించింది. స్క్రిప్టు వినగానే నటించేందుకు అంగీకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఆదివారం కూడా పనిచేసేవారు. ధనుష్ పోషించని పాత్రంటూ లేదు. యాక్టింగే కాదు అన్ని విభాగాల్లో ఆయనకు పట్టుంది. చెప్పినట్టుగానే పాత్ర కోసం సన్నబడ్డారు. ఫస్ట్షాట్తోనే ఆయన నటనకు ఇంప్రెస్ అయ్యా’’ అని శేఖర్ కమ్ముల తెలిపారు.
మా కెమిస్ట్రీ బాగుంటుంది: రష్మిక
‘‘నా సినీ ప్రయాణానికి సంబంధించి ఇక్కడ ప్రదర్శించిన వీడియో చూస్తే భయమేసింది. ఇన్ని రోల్స్ ప్లే చేశానా? అనే ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా ఒక సినిమా పూర్తవడానికి ఏడాది పడుతుంది. ఆ సమయంలో చిత్ర బృందంతో క్లోజ్ అవుతుంటాం. నేను నా ఫ్యామిలీని కలిసి ఏడాది అయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించాలన్న కల ఈ సినిమాతో నెరవేరింది. రియల్ లొకేషన్స్లోనే ఆయన షూటింగ్ చేస్తారు. నాగార్జున సర్తో నేను నటించిన రెండో చిత్రమిది. ఆయన మంచి నటుడే కాదు మంచి వ్యక్తి. ధనుష్తో కలిసి మరిన్ని సినిమాల్లో నటించాలనుంది. ఈ చిత్రంలోని మా కెమిస్ట్రీ ఆ అవకాశాలు అందిస్తుందనుకుంటున్నా’’ అని రష్మిక ఆశాభావం వ్యక్తం చేశారు.