ఇంటర్నెట్ డెస్క్: మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’ (Kannappa). ఈ నెల 27న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ల్లో రూ. 50 (జీఎస్టీ అదనం) (Kannappa Ticket Rates Hike in AP) వరకూ పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి.
ఇది విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు. దాదాపు పదేళ్లుగా ఆయన దీని కోసం వర్క్ చేశారు. ముకేశ్ కుమార్సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయన టైటిల్ పాత్ర పోషించగా.. రుద్రగా ప్రభాస్, కిరాతగా మోహన్లాల్, శివుడిగా అక్షయ్కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్, మహదేవ శాస్త్రిగా మోహన్బాబు నటించారు.
అన్నిరకాల చట్టపరమైన అనుమతులతో ‘కన్నప్ప’ను విడుదల చేస్తున్నామని నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేర్కొంది. భారత రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను మేము గౌరవిస్తున్నప్పటికీ.. సినిమాని కించపరిచేలా వ్యవహరిస్తే మాత్రం తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘కన్నప్ప’కు సంబంధించిన ఇద్దరు కీలక భాగస్వాములు, ప్రధాన నటులైన మోహన్బాబు, మంచు విష్ణు వ్యక్తిత్వానికి, ప్రచార హక్కులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇప్పటికే దిల్లీ హైకోర్టు వారికి రక్షణ కల్పించిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది.