Press "Enter" to skip to content

Kannappa: పవన్‌ కల్యాణ్‌కు ఈ సినిమా ఎప్పుడు చూపిస్తారు?: మంచు విష్ణు సమాధానమిదే

హైదరాబాద్‌: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం తాజాగా ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఇలాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని రూపొందించడం ఎంతో ఆనందంగా ఉందని దర్శకుడు ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు. సినిమా కోసం టీమ్‌ అందరూ శ్రమించారని చెప్పారు.

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఎలాంటి రెస్పాన్స్‌ ఉంది?

మంచు విష్ణు: గడిచిన 24 గంటల్లో 1,15,000 టికెట్లు అమ్ముడుపోయాయని నాకు సమాచారం అందింది. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదంతా శివలీలే.

సెన్సార్ వాళ్లు భారీగా కట్స్‌ చెప్పారా?

మంచు విష్ణు: సెన్సార్‌ వాళ్లకు ధన్యవాదాలు చెప్పాలి. మాకెంతో సపోర్ట్‌ చేశారు. ఈ సినిమా విషయంలో మాకు ఎదురైన పెద్ద సవాలు ఏమిటంటే.. తెలుగు ప్రేక్షకులకు కన్నప్ప కథ తెలుసు. ఉత్తరాది వారికి ఈ కథ చెప్పాలనుకున్నప్పుడు.. ఇందులో కొన్ని సన్నివేశాలు చూపించాల్సి ఉంది. వాటిని సెన్సార్‌ టీమ్‌ అంగీకరించలేదు. అందుకోసం ఫైట్‌ చేయాల్సి వచ్చింది. ఈతరం ప్రేక్షకులకు మన కథలు, పురాణ ఇతిహాసాలు తెలియాలనేది నా కోరిక. ఇలాంటి సన్నివేశాలు ఉంటే ఉత్తరాదిలో వివాదాలు తలెత్తవచ్చని చెప్పారు. ఆ విధంగా ఎన్నో చర్చలు జరిపి వారు అడిగిన విధంగా స్వల్ప మార్పులు చేశాం. కొన్ని సంభాషణలను మార్చాం.

ఏపీలో టికెట్‌ ధరలు పెంచారు? మరి తెలంగాణ సంగతి ఏమిటి?

మంచు విష్ణు: తెలంగాణలో టికెట్‌ ధరల పెంపు లేదు. ఏరోజు అయితే థియేటర్లలో పాప్‌కార్న్‌, కూల్‌ డ్రింక్స్‌ ధరలు తగ్గుతాయో.. ఆరోజు మల్టీప్లెక్సుల్లో ధరలు పెంచడం గురించి ఆలోచిస్తా. ఎందుకంటే, ఇది కుటుంబసభ్యులతో చూడాల్సిన సినిమా. అందుకే ధరలు పెంచి ఇబ్బందిపెట్టాలనుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని సెంటర్స్‌లో మాత్రమే రూ.50 పెంచాలని కోరాం. సినిమాలు చూడటం వల్లే నేను ఎన్నో గొప్ప కథలు తెలుసుకున్నా. అదేవిధంగా నేటితరం ప్రేక్షకులకు కూడా గొప్పకథలు అందించాలనుకుంటున్నా.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ప్రభాస్‌ను ఎందుకు తీసుకురాలేదు?

మంచు విష్ణు: ప్రభాస్‌కు మొహమాటం. ఇందులో భాగమైనందుకు ఆయనకు రుణపడి ఉంటా. తన మనస్తత్వం నాకు బాగా తెలుసు. ఆయన్ని ఇబ్బందిపెట్టే పనులు చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. సినిమాకు ఒక వీడియో బైట్‌ పంపిస్తా అన్నారు. కాకపోతే అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. తన వల్లే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నాం. ఇందులో తన రోల్‌ సుమారు 40 నిమిషాలు ఉంటుంది. కేరళలో ఈ చిత్రాన్ని సుమారు 300 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. మోహన్‌లాల్‌ వల్లే అక్కడ ఆస్థాయిలో విడుదల అవుతోంది. ఆయన రోల్‌ ఆశ్చర్యపరుస్తుంది. 

పవన్ కల్యాణ్‌కు ఈసినిమా ఎప్పుడు చూపిస్తారు?

మంచు విష్ణు: విడుదలైన వెంటనే ఆయన సమయం తీసుకుని వ్యక్తిగతంగా కలిసి సినిమా చూపిస్తా. మనకు తెలిసిన పవన్‌ కల్యాణ్‌ వేరు. ఈరోజు ఆయనపై రాష్ట్రం మొత్తం బాధ్యత ఉంది. తప్పకుండా ఆయన సమయం తీసుకుని సినిమా చూపించాలి. నటుడిగా ఆయన నాకు సీనియర్‌. ఆయన ప్రశంసలు వస్తాయా? రావా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

నిన్న ఒక లేఖ విడుదల చేశారు. రివ్యూలు చెప్పే వారికి అది హెచ్చరిక అనుకోవాలా?

మంచు విష్ణు: సినిమాని బతికించాలనేది నా ఉద్దేశం. సృజనాత్మకతను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతోనే ఆ నోటీస్‌ రిలీజ్‌ చేశా. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని రివ్యూవర్స్‌కు ఈ సినిమా చూపించాను. నార్త్‌లో ముగ్గురు రివ్యూవర్స్‌ ఈసినిమా చూశారు. నన్ను ప్రేమగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా గురించి ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో ముందే రివ్యూలు ఇచ్చేశారు. అదే అదునుగా చేసుకుని సోషల్‌మీడియాలో కొంతమంది వ్యక్తులు రివ్యూలు రాశారు. సినిమా బాలేదంటూ ఫేక్‌ పోస్టులు పెట్టారు. వారిని దృష్టిలో ఉంచుకునే నిన్న పోస్ట్‌ పెట్టాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పాం. అంతేకానీ హెచ్చరికలు జారీ చేసే స్థాయిలో నేను లేను. ఈ సినిమా ఇంత భారీ సినిమా అవుతుందని ఎవరూ నమ్మలేదు. అందుకే సినిమా మొదలుపెట్టినప్పుడు ఎంతోమంది ట్రోల్‌ చేశారు. వారిని తప్పుపట్టను .

ఈ సినిమాలో మీ పిల్లలందరూ యాక్ట్‌ చేశారా?

మంచు విష్ణు: ఇందులో నలుగురు పిల్లలూ యాక్ట్‌ చేశారు. నా సతీమణిని కూడా యాక్ట్‌ చేయమని అడిగా.  నా పిల్లల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. వాళ్లను నటీనటులుగా చూడాలనుకుంటున్నా. ఈ సినిమా విషయంలో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొలేదు. నా తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే మేము ముందు అడుగువేశాం. టీమ్‌ అందరూ ఎంతో శ్రమించాం. మేమంతా ఈ సినిమా ప్రేక్షకులకు చూపించేందుకు ఎదురుచూస్తున్నాం. ఈ స్క్రిప్ట్‌ను నాన్న ఎంతో నమ్మారు. భారీ స్థాయిలోనే ఖర్చుపెట్టారు. ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పనన్నా కూడా బడ్జెట్‌ గురించి బలవంతంగా చెప్పించారు. నిన్న మా కార్యాలయంలో జీఎస్టీ దాడులు జరిగాయి (నవ్వులు).  

ఓటీటీ డీల్‌ను మీరు పక్కన పెట్టినట్లు టాక్‌?

మంచు విష్ణు: 10 వారాల ముందు నా సినిమా ఓటీటీలో రాకూడదు. అందుకే డీల్‌ పక్కనపెట్టాను. రిలీజ్‌ ఒత్తిడి లేదు. ప్రేక్షకులకు ఉత్తమ సినిమా అందించాలనేది మాత్రమే నేను పెట్టుకున్న రూల్‌.

ఈ సినిమాతో ఏం చెప్పాలనుకుంటున్నారు?

మంచు విష్ణు: ఈ సినిమాతో మేము చెప్పాలనుకున్న విషయం ఒక్కటే. భగవంతుడికి భక్తుడికి మధ్య మధ్యవర్తులు, సంప్రదాయాలు అవసరం లేదు. మూఢ నమ్మకాలు అవసరం లేదు. మనసారా దేవుడిని ప్రార్థిస్తే.. ఆయన మనకు దగ్గరవుతారనేది ఈ సినిమా పూర్తి సారాంశం.

కన్నప్ప 2 ఉంటుందా?

మంచు విష్ణు: ఫిక్షనల్‌ స్టోరీ రాయాల్సిందే.

న్యూజిలాండ్‌లో 7వేల ఎకరాలు కొన్నారా?

మంచు విష్ణు: హహ్హహ్హ మీకు వంద ఎకరాలు రాసిస్తా. నాతో వచ్చేయండి.

తనికెళ్ల భరణితో ఏమైనా మాట్లాడారా?

మంచు విష్ణు: ఆయన స్క్రిప్ట్‌ ఇచ్చేసిన తర్వాత కమ్యూనికేషన్‌ లేదు. నేను నటించిన సినిమాల్లోనూ ఆయన ఉన్నారు. మా మధ్య దాని గురించి చర్చ జరగలేదు. ‘కన్నప్ప’ తగ్గట్టు పూర్తి స్క్రిప్ట్‌ వినిపించలేదు.

హిందీలో అక్షయ్‌కుమార్‌, కేరళలో మోహన్‌లాల్‌, పాన్‌ ఇండియా స్థాయిలో ప్రభాస్‌ మీ స్థానం ఎక్కడ?

మంచు విష్ణు: ఈ శుక్రవారం నాది. మీరు సినిమా చూసిన తర్వాత ఇదే విషయాన్ని చెబుతారు. ఫస్ట్‌ షో తర్వాత మీతో మాట్లాడతా. అతిరథ మహారథుల ముందు నేను నిలబడ్డానా? లేదా? ఈ పరీక్షల్లో నేను నెగ్గానా? లేదా? అని మీరే సినిమా చూసి చెబుతారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ దేవుడు ఉన్నాడా?అని ఏదో ఒక సమయంలో ప్రశ్న ఉదయిస్తుంది. ఆ ప్రశ్న నుంచి మళ్లీ పుట్టేదే నిజమైన భక్తి. చిన్నప్పటి నుంచి మనందరం భక్తుల్లానే ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు దేవుడు లేడు అనుకుంటాం. పరిస్థితులు మన చేయి దాటినప్పుడే భక్తి వస్తుంది. కన్నప్ప రాసేటప్పుడు కథలో లీనమై రాసుకొచ్చాను. ఎడిట్‌ రూమ్‌లో చూసిన తర్వాత ‘నేనా ఇది చేసింది’ అనుకున్నా. ఇది శివ లీలతోనే చేశాను. ఈ ప్రయాణం తర్వాత నా జీవితం మరింత పాజిటివ్‌గా మారింది.

Source link

More from NewsMore posts in News »