హైదరాబాద్: నాగార్జున (Nagarjuna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్బాస్’ (Bigg Boss Telugu). ఇప్పటికి 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు మరోసారి అలరించడానికి సిద్ధమైంది. ‘చదరంగం కాదు.. ఈసారి రణరంగం’ అంటూ ఇటీవల ‘బిగ్బాస్ సీజన్ 9’ (BIGG BOSS Season 9) నాగార్జున ప్రకటించారు. తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ను పంచుకున్నారు. షోలోకి సామాన్యులను సైతం ఆహ్వానిస్తున్నారు.
‘‘ఇప్పటివరకూ మీరు బిగ్బాస్ షోను ఎంతో ప్రేమించారు. ఇంత ప్రేమను ఇచ్చిన మీకు.. రిటర్న్ గిఫ్ట్గా ఏమివ్వాలి? మీరు ఎంతగానో ప్రేమించిన బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీయే రిటర్న్ గిఫ్ట్. ఈ సారి హౌస్లోకి సెలబ్రిటీలే కాదు. మీకూ అవకాశం ఉంది. వచ్చేయండి. బిగ్బాస్9 తలుపులు తెరిచి మీకోసం ఎదురు చూస్తున్నాయి’’ అని నాగార్జున పేర్కొన్నారు. ఇందుకు చేయాల్సిందల్లా bb9.jiostar.com వెబ్సైట్లో రిజిస్టర్ అయి, బిగ్బాస్9లో పాల్గొనడానికి కారణం చెబుతూ వీడియోను అప్లోడ్ చేస్తే, షరతుల మేరకు హౌస్మేట్ అయ్యే ఛాన్స్ లభించవచ్చని జియో హాట్స్టార్ పేర్కొంది.
‘ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే, యుద్ధం చేస్తే సరిపోదు. ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు. రణరంగమే’ అంటూ నాగార్జున సీజన్9ను పరిచయం చేశారు. ‘బిగ్బాస్9’ వ్యాఖ్యాతకు సంబంధించి గత కొన్నిరోజుల కిందట సామాజిక మాధ్యమాల వేదికగా ఆసక్తికర చర్చ నడిచింది. ఈసారి నాగార్జునకు బదులు బాలకృష్ణ వస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ, ‘బిగ్బాస్9’ ప్రకటనను నాగార్జునే చేయడంతో వ్యాఖ్యాత విషయంలో ఎలాంటి మార్పూ లేదని నిర్ధరణ అయింది. ప్రస్తుతం ‘బిగ్బాస్9’కు సంబంధించి హౌస్మేట్స్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ, టెలివిజన్ నటులతో పాటు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్కు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఒప్పందాలు, వడపోతల అనంతరం హౌస్లో పాల్గొనే వారి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. గత సీజన్లలోనూ ఒకరిద్దరు సామాన్యులకు హౌస్లో స్థానం కల్పించారు. ఈసారి ఏకంగా ప్రకటన ఇవ్వడంతో సీజన్ మరింత ఆసక్తిగా మారే అవకాశం ఉంది.