Press "Enter" to skip to content

The Raja Saab: ‘ది రాజాసాబ్‌’.. నెగెటివ్‌ క్యాంపెయిన్‌.. మారుతితో అవసరమా అన్నారు: చిత్రబృందం

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’ (The Raja Saab). డిసెంబర్‌ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ (the raja saab teaser) విడుదలైంది. ఈసందర్భంగా చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది. సినిమాకు సంబంధించిన పలు విశేషాలు పంచుకుంది.

మారుతితో అవసరమా అన్నారు..!!

‘‘ఈరోజు ఆనందంతో మాటలు రావడం లేదు. గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్‌’ చేస్తున్నప్పుడు ఓ రోజు యువీ వంశీ నా వద్దకు వచ్చి.. ‘ప్రభాస్‌తో సినిమా చేస్తావా?’ అని అడిగాడు. అవకాశం వస్తే ఎందుకు చేయనన్నాను. ప్రభాస్‌ నిన్ను ముంబయి రమ్మన్నాడు అని చెప్పగానే నేను వెళ్లా. ఆయన్ని చూడగానే దేవుడిని చూసిన భావన కలిగింది. నేను తెరకెక్కించిన ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘భలే భలే మగాడివోయ్‌’ తనకెంతో ఇష్టమని ప్రభాస్‌ చెప్పారు. అలాంటి సినిమా చేయాలని ఉందన్నారు’’

‘‘కొన్ని రోజులకు ‘పక్కా కమర్షియల్‌’ విడుదలైంది. సరిగ్గా ఆడలేదు. దీంతో అప్పటికే కమిట్‌ అయిన ప్రొడ్యూసర్‌ వెనక్కి వెళ్లిపోయారు. దాంతో ఈ ప్రాజెక్ట్‌ ఆపేద్దామని నిర్ణయించుకొని వంశీకి విషయం చెప్పా. అదే రోజు సాయంత్రం ప్రభాస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. నేను చెప్పిన కథ గురించి ఆయన ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. ఆయనకు నాపై ఎంత నమ్మకం ఉందో అప్పుడే అర్థమైంది. ఈ సినిమా ఎలాగైనా చేయాలనిపించింది’’

‘‘ప్రభాస్‌తో హారర్‌ కామెడీ చిత్రమంటే ఇంట్లో వాళ్లు కూడా సందేహం వ్యక్తంచేశారు. ఎంతో శ్రమించి ఈరోజు ‘ది రాజాసాబ్‌’గా మీ ముందుకు వచ్చాం. ఇది నాకు ఎమోషనల్ డే. మా సినిమా మొదలైనప్పుడు ‘మారుతితో సినిమా అవసరమా’ అని ఆయన్ని ఎంతోమంది అడిగారు. ఎంతమంది ఎన్ని మాటలన్నా ఆయన మాత్రం నన్ను నమ్మారు. నాకోసం నిలబడ్డారు. మీ అభిమానం, ప్రేమ ఆయన గుండెల నిండా నింపేసుకున్నారు. మీకంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన కనిపించడం లేదని మీరు బాధపడొచ్చు. కానీ మీకు బెస్ట్‌ ఇవ్వడం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. అభిమానుల కోసం వింటేజ్‌ డార్లింగ్‌, పాన్‌ ఇండియా బుజ్జిగాడిని చూపించాలనుకున్నాం. హీరోయిన్స్‌ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్‌లో ముగ్గురు హీరోయిన్స్‌ని తీసుకువచ్చాం (నవ్వులు). టీజర్‌తో ఈ ప్రపంచాన్ని పరిచయం చేశామంతే. సినిమా ఎలా ఉంటుందో మీ ఊహకు ఏమాత్రం అందదు. ఇంకా కొంచెం వర్క్‌ ఉంది. తప్పకుండా బాగా చేస్తాను. క్వాలిటీ కంటెంట్‌ ఇవ్వడానికి మేము ఎంతో శ్రమిస్తున్నాం’’ అని మారుతి అన్నారు.

ఒక నిర్మాత నెగెటివ్‌ క్యాంపెయిన్‌ చేశాడు..! 

‘‘ఇది కేవలం టీజర్‌ లాంచ్‌ మాత్రమే. ఈ టీజర్‌ లాంచ్‌కే ఇంత అద్భుతమైన విజువల్స్‌ మనకు అందించారంటే విశ్వప్రసాద్‌ విజన్‌ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. నా స్నేహితుడు మారుతి.. బందరులో సిరి కాంప్లెక్స్‌ ముందు ఆయన తండ్రి అరటిపళ్ల వ్యాపారం చేసేవారు. ఎప్పటికైనా సినిమాల్లోకి అడుగుపెట్టాలని మారుతి కలలు కన్నాడు. సుమారు 23 ఏళ్లు కష్టపడి ఈరోజు పాన్‌ ఇండియా స్టార్‌ పక్కన ఒక కటౌట్‌ పెట్టించుకునే స్థాయికి వచ్చాడు. 20 ఏళ్లుగా మారుతితో ప్రయాణిస్తున్నా. మీ అందరూ రాసి పెట్టుకోండి ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మీరు పదేళ్లుగా మిస్‌ అయిన రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ని ఈ చిత్రం మీ ముందుకు తీసుకువస్తుంది. ఈ సినిమా మొదలైనప్పుడు ఒక నిర్మాత దీనిపై నెగెటివ్‌ క్యాంపెయిన్‌ చేశాడు. రేపు ఆ నిర్మాతే పాజిటివ్‌ ట్రెండ్‌ చేస్తాడు. మారుతి ఎప్పుడూ అలాంటి క్యాంపెయిన్స్‌ నమ్మలేదు. తన బెస్ట్‌ ఇస్తానని చెప్పాడు. డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా షేక్‌ అవుతుంది’’ అని ఎస్‌కేఎన్‌ అన్నారు.

నిర్మాత విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘2024లో మా సంస్థ నుంచి వచ్చిన కొన్ని చిత్రాల ఫలితాల వల్ల మేము నిరాశకు గురయ్యాం. వాటన్నింటికీ సరైన సమాధానం చెప్పనుందీ చిత్రం. ఇదొక భారీ చిత్రం కానుంది. ప్రభాస్‌ని తొలిసారి కలిసినప్పుడు కంగారుపడ్డాను. ఆయన్ని ఎలా ఒప్పించాలా? అనుకున్నా. కానీ పది నిమిషాల్లోనే ఆయన మాతో సినిమా చేస్తానని అన్నారు. మా బ్యానర్‌కు ఇది బిగ్గెస్ట్‌ మూవీ’’ అని పేర్కొన్నారు.

Source link