Press "Enter" to skip to content

వానాకాలానికి భరోసా | general

పత్తి విత్తనాలకు భూమిని చదును చేస్తున్న రైతు

సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే: పంట పెట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో వానాకాలం, యాసంగిలో జమ చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ ఈ పథకాన్ని రైతు భరోసాగా కొనుసాగిస్తూ ఎకరానికి రూ.6 చొప్పున మంజూరు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం 6.17 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మిరప, కంది, ఇతర పంటలు సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే దాదాపు 30 వేల ఎకరాల్లో పత్తి సాగుచేశారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. త్వరలో వరినారు పోసుకునేందుకు సమాయత్తం కానున్నారు. ప్రస్తుతం పెట్టుబడి పెట్టే సమయం కావడంతో ఈ నెల 16 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేసి శని, ఆదివారాల్లో నివేదించనున్నారు. 

విస్తీర్ణంపై నేటికీ స్పష్టత కరవు

జిల్లా వ్యాప్తంగా 2.81 లక్షల మంది రైతులకు 2023-24 యాసంగిలో పెట్టుబడి సాయం అందింది. గతేడాది యాసంగికి సంబంధించి జనవరి 26 నుంచి రైతుల ఖాతాల్లో జమైంది. అందులో 2.44 లక్షల మందికే రూ.6 వేల చొప్పున.. అదీనూ 4 ఎకరాల లోపున్న వారి ఖాతాల్లోనే నగదు జమ చేసింది. తొలుత ఎకరం లోపు, ఆ తరువాత రెండు, ఆ తరువాత నాలుగు ఎకరాల వరకు ఇలా విడతల వారీగా మంజూరు చేసింది. ఆ తరువాత నిలిచిపోయింది. ఎంత మందికి.. ఎన్ని ఎకరాల వరకు సాయం అందిస్తారన్న అంశాలపై నేటికీ స్పష్టత కరవైంది. 

యాసంగిలో 32 వేల మంది దూరం

జిల్లాలో నాలుగు ఎకరాలు ఉండీ రైతు భరోసా అందని వారు దాదాపు 32 వేల మంది ఉన్నారు. వివిధ కారణాలతో సాయం మంజూరు కాని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించినా నేటికీ ఫలితం లేకపోయింది. నాలుగు ఎకరాలపైన ఉన్నవారికి యాసంగి సీజన్‌ ముగిసినా నేటికీ మంజూరు కాలేదు. 2025-26 వానాకాలానికి సంబంధించి నిరీక్షిస్తున్న వేళ ప్రభుత్వ ప్రకటన రైతుల్లో సంతోషం నింపింది. ఎన్ని ఎకరాల వరకు మంజూరు చేస్తారోననే సందిగ్ధం వారిలో నెలకొంది. గతంలో మంజూరు కానీ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Source link