ఇంగ్లాండ్ టూర్ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ను మార్చింది.
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో టీమ్ఇండియా (Team India) ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టులు ఆడనుంది. భారత జట్టుకు ఇది కీలకమైన సిరీస్. ఎందుకంటే ఈ సిరీస్తోనే డబ్ల్యూటీసీ 2025 – 2027 ప్రారంభం కానుంది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమ్ఇండియా కాస్త డీలా పడింది. సీనియర్ల నిష్క్రమణతో జట్టులోకి కొంతమంది యువ ఆటగాళ్లు ఎంట్రీ ఇచ్చారు. శుభ్మన్ గిల్ సారథ్యంలో కొత్త, పాత ప్లేయర్ల కలయికతో ఉన్న జట్టు ఇంగ్లాండ్ను ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టూర్ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ను మార్చింది. ప్రస్తుతం ఈ బాధ్యతలు చూస్తున్న సోహమ్ దేశాయ్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లే రౌక్స్ (Adrian le Roux)ను నియమించింది. ప్రస్తుతం ఆయన ఇంగ్లాండ్లో భారత జట్టుతో కలిశారు. ఆటగాళ్లతో కసరత్తులు చేయిస్తున్నారు.
తప్పు చేశా.. శ్రేయస్ అయ్యర్ నన్ను చెంపదెబ్బ కొట్టాల్సింది: శశాంక్ సింగ్
ఆటగాళ్ల స్ట్రెంత్ అండ్ కండీషనింగ్లో అడ్రియన్ లే రౌక్స్కు మంచి అనుభవం ఉంది. ఈయన గతంలోనూ టీమ్ఇండియాకు సేవలందించారు. 2022 జనవరి నుంచి మే 2003 వరకు స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్గా పనిచేశారు. అంతేకాదు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు గత ఆరేళ్లపాటు కండీషనింగ్ కోచ్గా వ్యవహరించి తనదైన మార్క్ చూపించారు. వివిధ రకాల వ్యాయామాలు చేయిస్తూ ప్లేయర్ల పురోగతిని పర్యవేక్షించారు. న్యూట్రిషన్ గైడెన్స్ ఇస్తూ ఆటగాళ్ల ఫిట్నెస్ మెరుగుపడేందుకు కృషి చేశారు. ఈ సీజన్లో పంజాబ్ ఫైనల్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆయనకు టీమ్ఇండియా స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్గా అవకాశం దక్కింది.